కొలంబో: 51 రోజుల రాజకీయ సంక్షోభానికి తెరపడింది. శ్రీలంకలో మరోసారి రాణిల్ విక్రమసింఘె ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం మరోసారి ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెలన్నర కిందట ఆయనను ప్రధాని పదవి నుంచి దించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనే విక్రమసింఘెతో ప్రమాణం చేయించారు. కొలంబోలోని అధ్యక్షుడి సెక్రటేరియట్లో ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా విక్రమసింఘె ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. శనివారం మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో మరోసారి విక్రమసింఘెకు లైన్ క్లియరైంది. అక్టోబర్ 26న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. ఆ రోజు ప్రధానిగా ఉన్న విక్రమసింఘెను తొలగించి రాజపక్సను సిరిసేన నియమించడంతో వివాదం మొదలైంది. రాజపక్స నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టే చెప్పడంతో చేసేది లేక ఆయన తప్పుకున్నారు. శుక్రవారమే విక్రమసింఘెతో ఫోన్లో మాట్లాడిన సిరిసేన.. ఆయనను మరోసారి ప్రధానిని చేయడానికి అంగీకరించారు.