ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీవ్ర తుఫానుగా మారిన పెథాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 16, 2018, 09:17 AM

నాలుగు రోజుల క్రితం అల్పపీడన రూపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెథాయ్, ఇప్పుడు తిత్లీని మించిన ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే పెను తుఫానుగా మారిన పెథాయ్, తీరంవైపు గంటకు 17 కిలోమీటర్ల వేగంతూ దూసుకొస్తోంది. రేపు కాకినాడ, మచిలీపట్నం మధ్య తుఫాను తీరాన్ని దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. కాగా, తుఫానుపై సమీక్ష జరిపిన ఏపీ సీఎం చంద్రబాబు, ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాను తీరం దాటే సమయం ముందుగానే తెలుస్తుంది కాబట్టి, ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మండలానికో అధికారిని ప్రత్యేకంగా నియమించి సహాయక చర్యలను తక్షణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.తుపాన్ నేపథ్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రభావిత మండలాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. కాగా, కోనసీమలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చి, భారీ ఎత్తున అలలు ఎగసి పడుతూ ఉండటంతో పరిసర ప్రాంతాల నివాసితులు భయపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 50కి పైగా పునరావాస కేంద్రాలు సిద్ధం అయ్యాయి. నేటి సాయంత్రం నుంచే పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా తుఫాను తీరాన్ని దాటే సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని తెలిపారు. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశామని, పాపికొండలకు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశామని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com