ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విచారణకు హాజరు కావాల్సిందే.... అవినాష్ రెడ్డికి మరోమారు అందిన నోటీసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 08:57 PM

తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయ్యాక మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో.. 28న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సీబీఐ ఆదేశించింది. అవినాష్‌రెడ్డి కి మూడు రోజుల క్రితమే మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. 24వ తేదీన విచారణకు రావాలని ఆదేశించింది.


ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల.. 24న తాను విచారణకు రాలేననని అవినాష్ రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు కనీసం ఐదు రోజుల సమయం కావాలని అవినాష్‌రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో రెండోసారి సీబీఐ నోటీసులు జారీ చేస్తూ.. 28న విచారణకు రావాలని సూచించింది. ఈ కేసును దాదారు రెండున్నరేళ్లుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా అవినాష్‌ను ప్రశ్నించలేదు. కడప నుంచి హైదరాబాద్‌కు కేసు బదిలీ అయిన తర్వాత విచారణ మొదలుపెట్టిన సీబీఐ.. అవినాష్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.


ఇటు వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించిన దస్త్రాలను హైదరాబాద్‌ ప్రిన్సిపల్‌ సీబీఐ కోర్టుకు తరలించారు. ఛార్జ్‌షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు, ఇతర దస్త్రాలను 3 ట్రంకు పెట్టెల్లో.. కడప జిల్లా సెషన్స్‌కోర్టు నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు తరలించారు. వివేకా హత్య కేసును ఢిల్లీ సీబీఐ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్, దస్తగిరిపై ప్రధాన ఛార్జిషీట్‌, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిపై అనుబంధ ఛార్జ్‌షీట్‌ను కడప (Kadapa) జిల్లా సెషన్స్‌ కోర్టులో సీబీఐ గతంలో దాఖలు చేసింది.


వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి బదిలీ చేయాలన్న వైఎస్‌ వివేకా కుమార్తె సునీత అభ్యర్థన మేరకు.. తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల అపెక్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫైళ్లన్నీ హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు చేరాయి. ఛార్జ్‌షీట్లు పరిశీలించాలని కోర్టు కార్యాలయాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు పరిశీలించి ఛార్జ్‌షీట్‌కు నంబరు కేటాయించిన తర్వాత.. హైదరాబాద్‌లో విచారణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com