విజయవాడ : కేంద్రంలోని మోడీ సర్కార్ పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు దీటుగా బదులివ్వాలని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ఇక్కడి హోటల్ ఐలాపురంలో జరుగుతున్న బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ సర్కార్ గతంలో కంటే ఎక్కువ సహాయమే చేసిందని హరిబాబు చెప్పారు. విభజన చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పదాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ ఏపీకి ఇచ్చిన ప్రతి హామీనీ కేంద్రంలోని మోడీ సర్కార్ అమలు చేస్తున్నదన్నారు. కేంద్ర విద్యాసంస్థలకు నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు.కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్న మాట పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఏపీ విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తున్నామని చెప్పారు. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం సానుకూలంగానే ఉందన్నారు. రైల్వే జోన్ విషయంలో పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కడప స్టీన్ ప్లాంట్ కు అనుకూలమేనని కేంద్ర మంత్రి ప్రకటించారన్నారు. కేంద్ర విద్యాసంస్థలకు తగిన విధంగా నిధుల కేటాయింపు జరుగుతోందని చెప్పారు. సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండానే కేంద్రం ఏపీకి సహాయం అందిస్తున్నదని హరిబాబు అన్నారు.