బెంగళూరు: దశాబ్దాల పాటు సాగుతున్న కావేరీ నదీ జలాల వివాదంలో కర్ణాటకకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధారామయ్య బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందే సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో అందటా సంబరాలు మొదలయ్యాయి. సీఎం సిద్ధారామయ్య అసెంబ్లీకి రాగానే అందరూ లేచి నిలబడి ఆయనకు అభినందనలు తెలుపుతూ స్వాగతం పలికారు. పార్టీలకు అతీతంగా నేతలు, ప్రజలు రహదారులపైకి చేరి మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని తెలియజేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కారణంగా బెంగళూరుకు అదనంగా 4.2 టీఎంసీల నీరు అందుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ‘అభివృద్ధి చెందుతోన్న నగరాల్లో బెంగళూరు ఒకటి. ఈ ప్రాంతానికి అదనపు నీరు కావాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మేం స్వాగతిస్తున్నాం’ అని ఖర్గే పేర్కొన్నారు.