న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మూడు కారణాలతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నెల 26వతేదీన గణతంత్ర దినోత్సవంతోపాటు ఢిల్లీలో ఆసియా దేశాల సదస్సు జరగనుంది. దీనికితోడు వివాదాస్పద చిత్రం పద్మావత్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూడు సాయుధ దళాలకు చెందిన బలగాలను దేశ రాజధాని నగరంలో మోహరించారు. నగరంలోని రద్దీ ప్రాంతాలు, మార్కెట్లపై సాయుధ పోలీసులు పహరా కాస్తున్నారు. పారామిలటరీ దళాలతోపాటు ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసియా దేశాల సదస్సు సందర్భంగా బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాసులతో అతిధులకు రక్షణ ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద పోలీసులు హై అలర్ట్ ప్రకటించడంతో ఢిల్లీ వీధుల్లో ఎటుచూసినా సాయుధ పోలీసులే కనిపిస్తున్నారు.