చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఆ క్రమంలో దీపావళి పండగ వేళ.. మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. అందుకోసం బుధవారం అంటే.. అక్టోబర్ 16వ తేదీ ఉదయం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై నిర్ణయించే అవకాశముందని సమాచారం. అలాగే చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది.
ఇక 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ ప్రతిపాదనపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ చేసేందుకు పలు ప్రతిపాదనకు రానున్నాయి. వాటిపై చర్చించి.. కేబినెట్ ఓ నిర్ణయం తీసుకోనుంది. దేవాలయాల పాలక మండలిలో 15 నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై ఈ సందర్భంగా చర్చించనుంది. దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి పచ్చ జెండా ఊపే అవకాశముందని తెలుస్తుంది.