ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఈసీ సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 10:38 PM

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై సుదీర్ఘ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులు కావడంతోపాటు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించగా.. వాటిపైనా సీఈసీ స్పందించారు.


ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ అవి భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతోందని వెల్లడించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ విషయంలో మీడియా సహా అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని తెలిపారు. ఇక ఎగ్జిట్‌పోల్స్‌తో ఎన్నికల సంఘానికి ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌కు శాంపిల్‌ సైజ్‌ ఏంటి.. సర్వేలు ఎక్కడ నిర్వహించారు.. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే బాధ్యత ఎవరిదీ అని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆలోచించుకోవాలని పేర్కొంది. ఈ ఎగ్జిట్‌పోల్స్ విషయంలో మీడియాకు కూడా స్వీయ నియంత్రణ అవసరమని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.


ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన ఫలితాలు.. తుది ఫలితాలకు మధ్య ఉండే తేడా.. పార్టీలకు, అభ్యర్థులకు, చివరకు ప్రజల్లో కూడా తీవ్ర నిరాశకు దారితీస్తోందని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు.. కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. తుది ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా బీజేపీకి పట్టం కట్టిన నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్ గురించి ఎన్నికల కమిషనర్ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇక హర్యానా ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈవీఎంలపై కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలపైనా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. స్పష్టతనిచ్చారు. మరీ ముఖ్యంగా ఈవీఎం బ్యాటరీలపై హస్తం పార్టీ నేతలు చేసిన ఆరోపణలపై స్పందించిన రాజీవ్ కుమార్.. అవి కాలిక్యులేటర్‌ లాగే ఉంటాయని వెల్లడించారు. ఈవీఎంలపై వచ్చిన 20 ఫిర్యాదులకు వాస్తవాలతో కూడిన వివరణ ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఓట్ల లెక్కింపు మొదలైన అరగంటలోపే మీడియాల్లో.. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేయడాన్ని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. అంత తొందర్లోనే ఫలితాల గురించి ఒక అంచనాకు ఎలా వస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉదయం 9:30 గంటల కంటే ముందు ఇచ్చే ఫలితాలు అంతా బోగస్ అని కొట్టిపారేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com