ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రేపు ఈ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు.. రెడ్ అలర్డ్ జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 09:36 PM

ఏపీవాసులకు అలర్ట్.. బుధ, గురువారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. మరో 24 గంటల్లో ఈ అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారుతుందని.. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, ప్రకాశం జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.


మరోవైపు అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం సహా కొన్ని జిల్లాలలో భారీ వానలు పడుతున్నాయి. కొన్నిచోట్ల విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. నెల్లూరు, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వం సైతం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. హోం మంత్రి వంగలపూడి అనిత, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేలా సన్నద్ధం చేస్తు్ననారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. చిత్తూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో ప్రతి మండలంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.


మరోవైపు తుపాను నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ కూడా అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాలలో ఎపిడెమిక్ సెల్‌లు ఏర్పాటు చేశారు. ఈ ఎపిడమిక్ సెల్‌లు 24 గంటలూ పనిచేస్తాయని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి తెలిపారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బుధ, గురువారాల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల మధ్య ఆరు జిల్లాలకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు కూడా విడుదల చేసింది. సహాయక చర్యల కోసం కోటి రూపాయలు చొప్పున ఆరు జిల్లాలకు నిధులు విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com