ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మహిళలకు శుభవార్త.. దీపావళికి మరో పథకం అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 09:37 PM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ దీపావళికి (అక్టోబర్ 31) ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తాము ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. ఏపీలో చాలారోజులుగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారనే చర్చ జరుగుతోంది.


ఈ క్రమంలో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాలు ఎప్పటి నుంచో చెప్పారు. దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. దీపావళికి ఉచిత సిలిండర్ల పథకం అమలు చేస్తామని.. ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం ఫ్రీ బస్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై హామీ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేస్తారని ప్రచారం జరిగింది.. ఆ తర్వాత దసరా అని కూడా చర్చించారు. దీపావళికి హామీ నెరవేర్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. కానీ చంద్రబాబు మాత్రం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తామన్నారు. కానీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పథకం అమలుపై అధ్యయనం జరుగుతోందని.. పక్కాగా మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు ఇప్పటికే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడ పథకం అమలవుతున్న తీరు.. మార్గదర్శకాలపై అధ్యయనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించగా.. ఒకటి, రెండుసార్లు ఈ అంశంపై చర్చ జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరుపై ప్రజల నుంచి విమర్శలు రావడంతో.. ఏపీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఫ్రీ బస్సు జర్నీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు, విమర్శలకు తావు లేకుండా, పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నారు. అందుకే సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి దీపావళికి ఈ ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని అమలు చేస్తారా.. మరికొద్దిరోజులు ఆగుతారా అన్నది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com