ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ.. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ

national |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 10:17 PM

ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి సమయం వచ్చేసింది. 2 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్న ప్రియాంక గాంధీ.. ఇప్పటివరకు ఏ ఎన్నికలోనూ పోటీకి దిగలేదు. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని వార్తలు వచ్చినా.. ఆమె బరిలోకి దిగలేదు. కానీ ఆ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ రెండు చోట్ల పోటీ చేసిన రాహుల్ గాంధీ.. రెండు స్థానాల్లోనూ బంపర్ మెజార్టీ సాధించారు. ఈ నేపథ్యంలోనే రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ.. వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని హస్తం పార్టీ ప్రకటించింది.


దీంతో ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అయింది. అయితే 1999 నుంచి కాంగ్రెస్ పార్టీలో, రాజకీయాల్లో ఉన్న ప్రియాంక గాంధీ.. ఏనాడూ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. మొదట్లో తన తల్లి సోనియా గాంధీ కోసం అమేథీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియాంక గాంధీ.. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారాన్ని ముందుండి నడిపించారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంఛార్జిగా కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యారు.


ఇక 2024 సార్వత్రిక ఎన్నికల బరి నుంచి సోనియా గాంధీ తప్పుకోవడంతో.. ఆమెకు కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేస్తారని అంతా భావించారు. సోనియా గాంధీ, అంతకుముందు ఇందిరా గాంధీ కూడా రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఇందిరా గాంధీ కంటే ముందు ఫిరోజ్ గాంధీ కూడా రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పలుమార్లు విజయం సాధించారు.


అయితే రాహుల్ గాంధీ తన కంచుకోట అయిన అమేథీలో 2019లో ఓడిపోయి.. వయనాడ్‌లో గెలవగా.. 2024 ఎన్నికల్లో అమేథీని వదిలిపెట్టి.. వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల్లో పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలోనే వయనాడ్ ఉపఎన్నిక అనివార్యం కాగా.. ఆ స్థానంలో ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాద్రా పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన రోజే.. వయనాడ్ లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక పేరును ప్రకటించడం గమనార్హం.


ఇక వయనాడ్‌తోపాటు మరో రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ప్రకటించింది. కేరళలోని పాలక్కడ్ అసెంబ్లీ స్థానంలో రాహుల్ మమ్కూటాతిల్.. చేలక్కర సీటు నుంచి రమ్య హరిదాస్ పోటీ చేస్తారని పేర్కొంది. ఇక వయనాడ్ ఉపఎన్నిక నవంబర్ 13వ తేదీన జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com