ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఒక్క ఆర్డర్‌ కారణంగా లారెన్స్ బిష్ణోయ్‌ని కస్టడీలోకి తీసుకోలేకపోతున్న ముంబై పోలీసులు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 10:41 PM

దేశంలో పలు హత్యలతో సంచలనం సృష్టించిన మాస్టర్‌మైండ్, పంజాబ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు జరపగా.. పలుమార్లు ఆయనను హత్య చేస్తామని బెదిరింపులు కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పంపించింది. ఇక ఇటీవల బిష్ణోయ్ గ్యాంగ్ మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే లారెన్స్ బిష్ణోయ్‌ని.. ముంబై పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే అవన్నీ విఫలం అయ్యాయి. అయితే అందుకు ఒకే ఒక కారణం. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆర్డర్ కారణంగా.. సబర్మతి జైలు నుంచి లారెన్స్ బిష్ణోయ్ బయటికి రాలేకపోతున్నాడు.


డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో గతంలోనే అరెస్ట్ అయిన లారెన్స్ బిష్ణోయ్‌ని ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి గతేడాది ఆగస్ట్‌లో గుజరాత్‌లోని సబర్మతి జైలుకు తరలించారు. అయితే అదే సమయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీఆర్‌పీసీ సెక్షన్ 268 కింద ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెక్షన్ ప్రకారం.. ఏడాది పాటు ఏ రాష్ట్రం గానీ, ఏ దర్యాప్తు సంస్థగానీ.. నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఉండదు. దీని ప్రకారం.. నిందితులు, ఖైదీలను తరలించడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తే.. ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది. అయితే గతేడాది ఆగస్ట్‌‌లో జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఈ ఏడాది ఆగస్ట్‌తోనే ముగియగా.. వాటిని మరో సంవత్సరం పాటు పొడిగించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.


దీంతో ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్‌ని ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకోలేకపోతున్నారు. అయితే సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఏప్రిల్‌లో కాల్పుల ఘటన జరిగిన తర్వాత ముంబై పోలీసులు.. లారెన్స్ బిష్ణోయ్ కస్టడీ కోసం ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. 2022లో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు తామే కారణం అంటూ ప్రకటించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. అప్పుడే నేషనల్ హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది. ఆ తర్వాత ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరపడంతో మరింత హైలైట్ అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com