కొందరు చేసే పనులు తీవ్రంగా ఆలోచించేలా చేస్తాయి. రాత్రి పగలు కష్టపడి కొందరు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. చేసేది చిన్న పని అయినా.. బాగా డబ్బులను వెనకేస్తూ ఉంటారు. ఇక మరికొందరు మాత్రం సంపాదించిన డబ్బును మంచి నీళ్ల లాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సాధారణ చాయ్వాలా చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అతడేం చేశాడంటే. డౌన్ పేమెంట్ చెల్లించి.. టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ను కొన్న ఆ చాయ్వాలా.. దాన్ని కొనడానికి చేసిన హంగు, ఆర్భాటం అంతా ఇంతా కాదు. రూ.20 వేలు డౌన్ పేమెంట్ కట్టిన ఆ చాయ్వాలా.. దాన్ని ఇంటికి తీసుకురావడానికి మరో రూ.60 వేలు ఖర్చు చేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాకు చెంది మురారి లాల్ కుష్వాహా అనే చాయ్వాలా ఒక మోపెడ్(TVS XL) కొన్నాడు. అది కూడా ఈఎమ్ఐల పద్దతిలో కొనుగోలు చేశాడు. ఇందుకోసం రూ.20 వేలు డౌన్ పేమెంట్ కింద చెల్లించి.. మిగితాదంతా నెల నెలా ఈఎమ్ఐల రూపంలో కడతానని పేర్కొన్నాడు. ఇక ఆ టీవీఎస్ ఎక్సెల్ను ఇంటికి తీసుకువచ్చేందుకు పెద్ద తతంగమే చేశాడు. జేసీబీతో ఊరేగింపుతో.. డీజేను రప్పించి.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి డ్యాన్సులు చేసుకుంటూ తీసుకెళ్లాడు. వీటన్నింటికీ మొత్తం రూ.60 వేలు ఖర్చు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో తెగ హల్చల్ చేస్తోంది.
తన ఇంటి దగ్గరి నుంచి షోరూమ్ వరకు ఇలా పెళ్లి బరాత్కు ఏ మాత్రం తీసిపోని విధంగా చేశాడు. ఇక షోరూమ్లో బండి కొన్న తర్వాత ఒక దండ వేసి, సెల్ఫీలు తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వారంతా చూసేందుకు జేసీబీ సహాయంతో దానిని పైకి ఎత్తించి షో చేశాడు. అయితే తన కొడుకు, కుమార్తెలు సంతోషంగా ఉంచేందుకే తాను ఇలా వేడుకలు చేస్తానని మురారి లాల్ కుష్వాహా మీడియాకు వెల్లడించాడు. అయితే టీవీఎస్ ఎక్సెల్ కొనడానికి వెళ్లి మురారి లాల్ కుష్వాహా చేసిన హంగామాపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజే సౌండ్ కారణంగా శబ్ధ కాలుష్యం వచ్చిందని పేర్కొంటూ మురారి లాల్ కుష్వాహాతోపాటు డీజే ఆపరేటర్ పైనా కేసు నమోదు చేశారు.
అయితే ఇలాంటి సంబరాలు చేసుకోవడం మురారి లాల్ కుష్వాహాకు కొత్తేమీ కాదు. గతంలో రూ.12,500 అప్పు తీసుకుని.. ఒక సెల్ఫోన్ కొనుగోలు చేసి.. అది కొన్న సంతోషంతో.. రూ.25 వేలు ఖర్చు పెట్టి వేడుకలు చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన వాళ్లంతా అప్పు చేసి పప్పుకూడు అంటే ఇదేనేమో అనుకుంటున్నారు.