ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాలకు కార్లు పాడవకుండా.. ఫ్లైఓవర్ మీద పార్కింగ్

national |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 10:45 PM

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావానికి తోడు ఈశాన్య రుతుపవనాల ప్రవేశించడంతో తమిళనాడు, పుదుచ్చేరిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనంగా బలపడి 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీరాల్లోకి పయనిస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో చెన్నై సహా సముద్రతీర జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది మంగళవారం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, కడలూరు జిల్లాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒకటి రెండు చోట్ల భారీనుంచి అతి భారీవర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.


ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం, అధికారుల అప్రమత్తమయ్యారు. చెన్నై, తిరువల్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు సహా పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఇక, ప్రజలు కూడా తమ వాహనాలు, సామగ్రిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. చెన్నైలోని వెల్‌చెరీ పార్కు వద్ద స్థానికులు తమ వాహనాలను ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వరద నీటిలో వాహనాలు మునిగిపోకుండా అక్కడ ఉన్న ఫ్లైఓవర్‌పై పార్కింగ్ చేసుకుంటున్నారు. మరికొందరు అపార్ట్‌మెంట్‌లలో పైకి తీసుకెళ్లి ఇంట్లో, వరండాలో పార్క్ చేసి భద్రపరుచుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కాగా, మంగళ, బుధవారాల్లో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు తదితర ఉత్తర జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. అలాగే 17న తిరువళ్లూరు, రాణిపేట, వేలూర్, తిరుప్పత్తూరు, కృష్ణగిరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం, చెన్నై, కాంచీపురం, తిరువణ్ణామలై, ధర్మపురి, సేలం, ఈరోడు జిల్లాల్లో భారీవర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అక్టోబరు 17వ తేదీ వరకు వరకు తీర ప్రాంతాలు, బంగాళాఖాతంలో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.


భారీ వర్షాలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే 15న చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మంళవారం నుంచి శుక్రవారం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com