ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిష్ణోయ్‌లకు, కృష్ణజింకలకు సంబంధం ఏంటి

national |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 10:18 PM

1998 కృష్ణజింకల హత్య ఘటన.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ జీవితంలో ఒక మాయని మచ్చగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ఘటన జరిగి 26 ఏళ్లు పూర్తయినా.. ఆ తాలుకా గాయాలు మాత్రం ఇప్పటికీ సల్మాన్ ఖాన్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న పంజాబీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి గ్యాంగ్.. గత కొన్నేళ్లుగా సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామని హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సల్మా్న్ ఇంటి ముందు కాల్పులు జరపడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సల్మాన్ ఖాన్‌కు సన్నిహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపడంతో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే మళ్లీ కృష్ణ జింకల వ్యవహారం తెరపైకి వచ్చింది.


"హమ్ సాత్ సాత్ హై" అనే సినిమా షూటింగ్ సమయంలో 1998లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపంలో 2 కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్‌ సహా పలువురు హత్య చేశారని నమోదైన కేసు.. దశాబ్దాలుగా సాగుతోంది. ఈ క్రమంలోనే కృష్ణ జింకలను చంపాడనే కోపం.. బిష్ణోయ్ తెగకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇక గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన లారెన్స్ బిష్ణోయ్.. గతంలో చాలాసార్లు సల్మాన్ ఖాన్‌ను హత్యం చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బహిరంగంగానే హెచ్చరికలు కూడా చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే బాబా సిద్ధిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసిన విషయం తెలిసిందే. బిష్ణోయ్ తెగ ఆరాధ్య దైవంగా కొలుచుకునే కృష్ణ జింకలను చంపడమే సల్మాన్ ఖాన్ చేసిన పెద్ద తప్పు అయింది. అయితే ప్రస్తుతం 31 ఏళ్ల ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన సమయంలో అతడి వయసు కేవలం 5 ఏళ్లు మాత్రమే. అయితే అప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌పై అంత కోపం పెంచుకున్నాడా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.


అయితే బిష్ణోయ్ అనేది ఒక తెగ. 15వ శతాబ్దంలో గురు జంభేశ్వర్ (జంబాజీ) ఈ బిష్ణోయ్ తెగకు ఆజ్యం పోశారు. వన్యప్రాణులు, వృక్షసంపద, వాటి సంరక్షణ గురించి.. 29 సూత్రాలతో జంబాజీ ఈ బిష్ణోయ్ తెగకు మార్గనిర్దేశం చేశారు. బిష్ణోయ్ చెప్పిన ప్రధాన సిద్ధాంతాల్లో ప్రధానమైంది కృష్ణ జింకల్ని రక్షించుకోవడం అని 2018లో బిష్ణోయ్ తెగకు చెందిన రామ్ స్వరూప్ చెప్పాడు. అయితే జంబాజీ మరణించే ముందు.. కృష్ణ జింకల్ని తన పునర్జన్మగా భావించాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటినుంచి చనిపోయిన బిష్ణోయ్‌లు మళ్లీ కృష్ణ జింకలుగా పుడతారని బిష్ణోయ్ తెగ వారు విశ్వసిస్తారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ చరిత్రకారుడు వినయ్ లాల్.. బిష్ణోయ్‌ తెగపై జరిపిన పరిశోధనల్లో గుర్తించి చెప్పారు. కృష్ణ జింకలతో బిష్ణోయ్‌లకు 550 ఏళ్ల నుంచి బంధం ఉందని సమాచారం.


ఇక గత కొన్ని శతాబ్దాల నుంచి బిష్ణోయ్ తెగకు చెందినవారు కృష్ణ జింకలు, వృక్ష సంపదతో విడదీయలేని సంబంధం కలిగి ఉన్నారు. ఇక బిష్ణోయ్ తెగలోని మహిళలు.. తల్లి లేని కృష్ణ జింకలకు స్వయంగా పాలిచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. బిష్ణోయ్‌లు.. కృష్ణ జింకలను తమ గురువు జంబాజీగా భావిస్తారు కాబట్టి.. వాటిని చంపేందుకు వచ్చిన వారిని తరిమికొడతారు. అయితే సల్మాన్ ఖాన్‌ కృష్ణ జింకలను వేటాడి చంపినందుకే లారెన్స్ బిష్ణోయ్.. అతడిపై చంపేంత పగ పెంచుకున్నాడని కొందరు చెబుతారు. అయితే గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగే క్రమంలో.. పెద్ద పెద్ద వారిని టార్గెట్‌ చేసుకుంటే తొందరగా ఫేమస్ అయ్యేందుకు కూడా ఇలాంటివి తెరపైకి తీసుకువస్తారని మరికొందరు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com