ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకేరోజు 2 ఎయిరిండియా విమానాలకు బాంబు బెదిరింపులు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 09:43 PM

వరుస బాంబు బెదిరింపులతో ఎయిరిండియా విమానయాన సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకేరోజు రెండు ఎయిరిండియా విమానాల్లో బాంబులు ఉన్నాయని సమాచారం అందడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఇందులో ఒకటి దేశీయ విమానం కాగా.. మరొకటి అంతర్జాతీయ విమానం ఉంది. ఢిల్లీ నుంచి చికాగోకు ప్రయాణిస్తున్న ఎయిరిండియాలో బాంబు ఉన్నట్లు ఆగంతకులు ఇచ్చిన సమాచారంతో అలర్ట్ అయిన ఎయిరిండియా సంస్థ.. వెంటనే ఆ విమానాన్ని కెనడా ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఆ తర్వాత ఆ విమానంతోపాటు అందులోని ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఇక రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన విమానంలో బాంబు ఉందనే సమాచారం రావడంతో హుటాహుటిన అయోధ్య ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.


139 మంది ప్రయాణికులతో జైపూర్ నుంచి బయల్దేరిన విమానం.. బెంగళూరుకు వెళ్తుండగా.. బాంబు బెదిరింపులకు సంబంధించిన సమాచారం వచ్చింది. దీంతో ఆ విమానాన్ని వెంటనే అయోధ్యలోని మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దింపారు. ఆ తర్వాత అధికారులు విమానంలో తనిఖీలు నిర్వహించగా.. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎస్పీ రాజ్‌కరణ్‌ నయ్యర్‌ ఆధ్వర్యంలో విమానంలో సోదాలు చేపట్టారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.


మరోవైపు.. ఢిల్లీ - చికాగో మధ్య నడిచే ఏఐ127 ఎయిరిండియా విమానం మంగళవారం ఢిల్లీ నుంచి బయలుదేరింది. అయితే ఈ ఏఐ127 విమానానికి ఆన్‌లైన్‌లో బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే ఆ విమానాన్ని కెనడాలోని ఇకాలూట్‌ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ఇక సెక్యూరిటీ రూల్స్ ప్రకారం ఆ విమానలోని ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి బయల్దేరిన ఈ విమానం అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు చికాగోకు చేరుకోవాల్సి ఉండగా.. ఆ విమానంలో బాంబు బెదిరింపుల కారణంగా కొన్ని గంటల పాటు కెనడాలోని ఎయిర్‌పోర్టులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ విమానంలో తనిఖీలు పూర్తి అయ్యేవరకు ఇకాలూట్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి.


అయితే ఇటీవలె ముంబై నుంచి న్యూయార్క్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడం గమనార్హం. ఆ విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అంతకుముందు ఇండోర్‌లోని దేవి అహల్యబాయ్‌ హోల్కర్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు రావడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com