ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మహిళలకు శుభవార్త.. మళ్లీ ఆ పథకం అమలు, కిట్‌తో పాటూ రూ.5వేలు ఇస్తారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 09:41 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. 2014-2019 మధ్య అప్పటి టీడీపీ సర్కార్ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అప్పటి ప్రభుత్వం అమలు చేసిన ఎన్టీఆర్‌ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 జులై 12న ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం రూ.800 విలువైన స్లీపింగ్‌ బెడ్, పౌడర్, లోషన్, న్యాప్‌కిన్, డైపర్స్, దుప్పటి, దోమతెర ‌తో పాటు చిన్నపిల్లల సబ్బులను జిప్‌ బ్యాగ్‌లో ఉంచి బాలింతలకు అందజేసింది.


గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదు.. రద్దు చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్‌లో అమలవుతున్న ఈ తరహా పథకాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి కనీసం రూ.1,200 నుంచి రూ.1,300 వరకు ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ‘ఆసరా’ కింద బాలింతలకు ప్రస్తుతం రూ.5 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తోంది.


మరోవైపు రాష్ట్రంలో భూముల రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశఇంచారు. అయితే దూరాన్నిబట్టి ఒకేరోజు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు సభలను నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల్లో రీ-సర్వేపై అవగాహన కల్పించాలని రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లను ఆదేశించింది ప్రభుత్వం. అందుకు తగిన విధంగా నిర్వహించే గ్రామసభల్లో అన్ని రకాల భూసమస్యలపై.. రైతుల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. రైతులెవరైనా రీ-సర్వేతో నష్టపోయినట్లు ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటారు అధికారులు.


ఏపీ టిడ్కో ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న బి.సునీల్‌కుమార్‌రెడ్డికి హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్, దెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ నియామకాలపై మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ కార్యదర్శిగా మహ్మద్‌ మస్తాన్‌ను నియమిస్తూ మైనారిటీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


ఇదిలా ఉంటే.. పల్లెపండుగ వారోత్సవాల ఫ్లెక్సీలు, వాల్‌ పెయింట్స్, సిటిజన్‌ నాలెడ్జ్‌ బోర్డులపై ప్రధాని నరేంద్రమోదీ ఫోటో అంశం చర్చనీయాంశమైంది. కొన్నిచోట్ల వాటిపై ప్రధాని ఫొటో లేని విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలిసింది.. వెంటనే స్పందించిన ఆయా బోర్డులపై ప్రధాని, సీఎం, రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం, పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథకం లోగోలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రధాని ఫొటో కచ్చితంగా ఉండాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com