బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తదుపరి రెండు రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతుందని, దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని, పలుచోట్ల అతి తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు.
మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశముందన్నారు. మిగత జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవవచ్చని చెప్పారు. తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ అన్నారు.