సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్ళపై అత్యాచారం చేసిన ఘటనలో 48 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఘటనలో నిందితులకు వేగంగా శిక్ష పడాలని ఆదేశాలు జారీ చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ దీనిపై విచారణ కోసం కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందులో ప్రజల. భాగస్వామ్యం కూడా కోరుతున్నామన్నారు.
తమ ఇళ్ల వద్ద, వ్యాపార వాణిజ్యం సముదాయాల వద్ద పెట్టుకున్న సీసీ కెమెరాలను పోలీసు శాఖకు అనుసంధానం చేస్తే నేర నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు. పోలీసులకు ఆయుధాల్లాగే ప్రజలకు మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని, వాటిని వినియోగించి నేర నియంత్రణకు సహకరించాలని హోంమంత్రి అనిత కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే సత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనలో అత్యంత వేగంగా విచారణ కోసం దొరికిన 5 గురు నిందితుల్లో ఒకరిపై 37 కేసులు ఉన్నాయని, అతనిపై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయని, అందుకే త్వరితగతిన విచారణకు ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తున్నామని తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.