వలస కూలీలకు సంబంధించి బీహార్ సర్కార్ వినూత్న నిర్ణయం తీసుకుంది. వలస కూలీలకు సర్కార్ ఆహార వస్తువులు,నగదు ఇచ్చి ఆదుకోవడం చూశాం. కానీ బీహార్ సర్కార్ మాత్రం వలస కూలీలకు కండోమ్స్ కూడా పంపిణీ చేస్తోంది. ఇది పూర్తిగా కుటుంబ నియంత్రణ చర్య అని దీనికి కరోనాతో సంబంధం లేదని బీహార్ వైద్యశాఖాధికారి తెలిపారు.ఇతర ప్రాంతాల నుంచి బీహార్ చేరుకున్న కార్మికులు 14 రోజులు క్వారంటైన్ లో ఉంటున్నారు. ఆ తర్వాత వారిని హోం క్వారంటైన్ తరలించే ముందు అధికారులు వారికి ఉచితంగా కండోమ్స్ పంపిణీ చేస్తున్నారు. అవాంఛిత గర్భధారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు వలస కూలీలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య అధికారిగా జనాభాను అదుపులో ఉంచడం తమ బాధ్యత అన్నారు. బీహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.