కోవిడ్ నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం ఉదయం జరిగిన సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లలో భౌతిక దూరం తప్పనిసరి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే కన్వెన్షన్ సెంటర్లలో జరిగే ఫంక్షన్లలో రెండు కుర్చీల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలని, థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచాలని ఆదేశించింది. ఆ ఆస్పత్రులలో మంచి వైద్య సదుపాయాలు, వైద్యులు అందుబాటు, శానిటేషన్ పక్కాగా ఉండేలా చూడాలని, కోవిడ్ నిర్థారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్ట్లు, కరోనా టెస్టు కోరుకున్న వారికే టెస్టులు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామాలు, వార్డులలో ఇప్పటికే వాలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నామని.. ఎవరైనా జ్వరంతో బాధ పడుతున్నా, లేదా అలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయాలని ఆదేశించారు. అన్ని ఆస్పత్రులలో తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండాలని, విశాఖలోని ప్లాంట్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు. అవసరమైతే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు.