పెళ్లి చూపులకు వెళ్లిన ఫ్యామిలీపై కరోనా పంజా విసిరింది. డ్రైవర్ నుంచి అందరికీ సోకి.. చివరకు ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో నలుగురు వైరస్ భారిన పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన యువకుడికి ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంకు చెందిన యువతితో నిశ్చితార్థమైంది. కొన్ని రోజుల క్రితం యువతి బంధువులు యువకుడి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లారు. పెళ్లి కూతురు తాత, తల్లీదండ్రులు, పెదనాన్న, పెద్దమ్మ కారులో వెళ్లారు. ఆ కారును ఓ 108 అంబులెన్స్ డ్రైవర్ నడిపారు.పెళ్లి చూపుల్లో అబ్బాయి నచ్చడంతో.. అమ్మాయిని చూసేందుకు రావాలని వారిని ఆహ్వానించారు. అనంతరం జూన్ 19న యువకుడి కుటుంబ సభ్యులు కూడా ఎస్.యానాంకు వెళ్లారు. కొన్ని రోజులకు అమ్మాయి తరఫు వారు ప్రయాణించిన కారును నడిపిన డ్రైవర్ (108 అంబులెన్స్ నడిపే డ్రైవర్)కు కరోనా వచ్చినట్లు తేలింది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పెళ్లి కుమార్తె తాత, తల్లిదండ్రులు, పెద్దనాన్న, పెద్దమ్మకు కరోనా వచ్చినట్లు తేలింది. చికిత్స పొందుతూ ఆదివారం పెళ్లి కుమార్తె తాత మరణించాడు. ఈ నేపథ్యంలో అబ్బాయి కుటుంబ సభ్యులు అప్రమత్తమై హోం క్వారంటైన్ లో ఉన్నారు.