జమ్మూ కశ్మీర్లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. కుప్వారాలో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో రూ.65 కోట్ల విలువైన మత్తుపదార్థాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. టిఒఐ కథనం మేరకు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న సైన్యం.. వారి వద్ద నుంచి 13.5 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.మార్కెట్లో వీటి విలువ రూ.65 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను బరాముల్లా జిల్లాలోని బిజ్హమా, లచీపోర్కు చెందిన మంజూన్ అహ్మద్ లోనే, గౌస్ మహ్మద్ లోనేగా గుర్తించారు. వీరి వద్ద రెండు తుపాకులు, నాలుగు మ్యాగజైన్లు, 55 లైవ్ రౌండ్లు, నాలుగు హ్యాండ్ గ్రనేడ్లు, 10 డిటోనేటర్లు లభ్యమైనట్టు వివరించారు.