నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కాగా, ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారె సమర్పించింది. ఈ ఉదయం ఆలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, అమ్మవారికి సారె సమర్పించారు. ఆషాఢ మాసం తొలిరోజు సందర్భంగా అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో వారిని నియంత్రించడంలో అధికారులు, పోలీసులు అవస్థలు పడాల్సి వచ్చింది. పలు ప్రాంతాల్లో భౌతిక దూరం నిబంధనలను భక్తులు పాటించలేదు.కాగా, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి, ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని, కరోనా మహమ్మారి తొలగి పోవాలని మొక్కానని అన్నారు. భక్తులకు దర్శనాల విషయంలో ఇప్పటికే పలు మార్గదర్శకాలను జారీ చేశామని, భక్తులు వాటిని పాటించాలని విజ్ఞప్తి చేశారు.