ప్రభుత్వ రంగంలో వున్న వాటిని ప్రైవేటీకరణ చేస్తే సమాజానికి తీరని ముప్పు వస్తుందని ఉక్కు గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి. ఆదినారాయణ అన్నారు. విశాఖ పోర్టు ట్రస్టు భూములు అమ్మకానికి, పోర్టు కల్యాణ మండపాల ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ గురువారం స్టీల్ ప్లాంట్ టీటీ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల దృష్ట్యా వున్న భూములను అమ్మడం దుర్మార్గమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నింటినీ అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. దేశ సంపద అతికొద్ది మంది చేతుల్లోకి వెళుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జె. అయోధ్యరామ్, నీరుకొండ రామచంద్రరావు, కేఎస్ఎన్ రావు, వరసాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.