ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. 11వ తేదీ తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు... సీఎం. తిరుపతిలో బర్డ్ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు... పైకప్పుతో కొత్తగా నిర్మితమైన అలిపిరి మెట్ల మార్గాన్ని, పాదాల మండపం వద్ద కొత్తగా నిర్మించిన గో మందిరాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని... శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 11న రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు... సీఎం జగన్. 12న ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకుంటారు. టీటీడీ ఆధ్వర్యంలో తీసుకొస్తున్న ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానల్స్ను సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత 12 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికీకరించిన బూందీ పోటును ప్రారంభిస్తారు. టీటీడీ అమలు చేస్తున్న నూతన కార్యక్రమాల ప్రజెంటేషన్కు, టీటీడీ రైతు సాధికారక సంస్థ ఎంఓయూ కార్యక్రమానికి జగన్ హాజరవుతారు. పర్యటన పూర్తయ్యాక... రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరిగి తాడేపల్లికి బయల్దేరి వెళ్తారు.