'నేను వున్నాను.. నేను విన్నాను.. నేను చూశాను' అన్నది 10 వేల ఉద్యోగాల ఖాళీలేనా జగన్ రెడ్డి? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ చేసిన మోసం వల్లే యువత ఆత్మహత్యలు చేసుకుంటోందన్నారు. కర్నూలు జిల్లా, చనుగొండ్ల గ్రామంలో గోపాల్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. గోపాల్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంటికోక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పి.. రెండేళ్లలోనే కోటి మందికి ఉపాథి పోగొట్టిన ఘనత జగన్దేనన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్భాలు పలికి మోదీకి వంగి, వంగి నమస్కారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై యువతను దారుణంగా జగన్ దగా చేశారని మండిపడ్డారు. హోదా తేవడం చేతగాదని జగన్ చేతు లేత్తెశారని, దీనిపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.