సీఎం జగన్ను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కలవడంపై టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దావెంకన్న విమర్శలు గుప్పించారు. ప్రత్యేక విమానంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి, అవినీతి చక్రవర్తితో కలిసి భోజనం చేయడమేంటి అని ప్రశ్నించారు. ఎందరో అవినీతి ముఖ్యమంత్రులను జైలుకు పంపిన వ్యక్తి, అవినీతి సామ్రాట్తో ఏం మంతనాలు జరిపారని నిలదీశారు. సుబ్రహ్మణ్యస్వామికి జగన్తో ఉన్న లాలూచీ ఏమిటో, వారిద్దరి మధ్య జరిగిన చర్చలేమిటో ఆయనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎవరి మెప్పుకోసం సుబ్రహ్మణ్యస్వామి చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని పసలేని ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాలతోనే సుబ్రహ్మణ్యస్వామి, జగన్తో సమావేశమయ్యాడని ప్రజలకు అర్థమైందన్నారు. జగన్ పై, ఆయన ప్రభుత్వ అవినీతిపై తెలుగుదేశంపార్టీనే పోరాడుతోందనే వాస్తవం సుబ్రహ్మణ్యస్వామికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ ప్రభుత్వం వేలకోట్లు ఖర్చుచేసిందని ఆరోపించారు. పోలీసులు, అధికారుల సాయంతో టీడీపీ వారిని అడ్డుకొని రాత్రికి రాత్రే వైసీపీ నేతలు డబ్బు పంపిణీ చేశారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి జగన్ ప్రభుత్వంపై ఉన్న భయమే కారణమన్నారు. కొల్లురవీంద్ర నిజంగా ఎన్నికల విధులకు ఆటంకం కల్గిస్తే, అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ఆదేశాలకోసం పోలీసులు ఎదురు చూశారా అని ప్రశ్నించారు. ఫలానా రంగు చొక్కానే వేసుకోవాలని ఏ రాజ్యాంగంలో రాసి ఉందో పోలీసులు చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.