వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పార్లమెంటు పెద్దలసభలో ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థ పారదర్శకంగా వ్యవహరించడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే మాటలను పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ కూడా చేశారు. విజయసాయి వ్యాఖ్యలపై పలువురు విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నేత వర్ల రామయ్య ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 11 సీబీఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తి విజయసాయి అని దుయ్యబట్టారు. ఈ కేసుల్లో కండిషనల్ బెయిల్ పై బయటకు వచ్చిన విజయసాయి... ఏకంగా పార్లమెంటులో న్యాయ వ్యవస్థను కించపరిచే వ్యాఖ్యలు చేశారని... ఇలా వ్యవహరించినందుకు అత్యున్నత న్యాయస్థానం అతని బెయిల్ రద్దు చేసి, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పొద్దూ అని అన్నారు.