రేపటి నుంచి ఐపీఎల్ సందడి మొదలు కాబోతోంది. యూఏఈ వేదిగా ఈ మెగా టోర్నీ జరగబోతోంది. ఐతే అంతకు ఒక్క రోజు ముందు ఎయిర్ ఇండియా సబ్సిడరీ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధారిటీ బిగ్ షాకిచ్చింది. దుబాయ్, ఇండియా మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసుల రాకపోకలను నిలిపివేసింది. సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 2 వరకు ఇది అమల్లో ఉంటుంది. కరోనా రోగిని విమానంలోకి అనుమతించి, దుబాయ్కి తీసుకువచ్చారన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది. మీ నిర్లక్ష్యం కారణంగా మేము ఇబ్బందులు పడుతున్నామంటూ మండిపడింది. విమానంలో ప్రయాణించి ఆ వ్యక్తికి సెప్టెంబరు 2న కరోనా నిర్ధారణ అయింది.
కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు జైపూర్లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ రిపోర్టు ఇచ్చింది. ఐతే సెప్టెంబర్ 4న అతడు జైపూర్ నుంచి దుబాయ్కి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX1135లో ప్రయాణించాడు. దుబాయ్ ఎయిర్పోర్టులో దిగిన తర్వాత అతడికి కరోనా ఉన్న విషయం ఎయిర్పోర్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు లేఖ రాసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అతడి వల్ల మిగతా ప్రయాణికుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని విమర్శిస్తూ విమాన సర్వీసులపై తాత్కాలిక నిషేధం విధించింది. అంతేకాదు ఆ విమానంలో ప్రయాణించిన వారిని క్వారంటైన్ చేసేందుకు అవసరమైన ఖర్చును కూడా ఎయిర్ ఇండియానే భరించాలని తెలిపింది.