పద్మ అవార్డుల మాదిరిగా సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అవార్డుకు సంబంధించిన విధి విధానాలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది. భారత తొలి హోంమంత్రిగా సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ దేశ ఐక్యతకు చేసిన అనుపమాన సేవలకు గుర్తుగా ఆయన పేరిట అవార్డు ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ 2018, డిసెంబర్ 23న ప్రకటించిన విషయం తెలిసిందే.
అవార్డు విధి విధానాలు:
* దేశ ఐక్యత, సమగ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
* రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
* శుద్ధమైన బంగారం, వెండి మిశ్రమంతో పతకాన్ని రూపొందిస్తారు.
* అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ అవార్డును మరణానంతరం ప్రకటిస్తారు.
* హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రత్యేక కమిటీ అవార్డుకు అర్హులైన వారి పేర్లను ఎంపిక చేస్తుంది.