రెప్పపాటులోనే ఘోరం జరిగిపోతోంది. క్షణకాలంలోనే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వాహనదారులు చేస్తున్న చిన్న చిన్న తప్పులే రోడ్డు ప్రమాదాలకు కారణమయవుతున్నాయి. అతి వేగం, మద్యం తాగి వాహనం నడపడం వంటివి చేయొద్దని పోలీసులు హితవు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఒక గంట ఆలస్యంగా గమ్యం చేరినా పర్లేదు కానీ, అతి వేగం కారణంగా ప్రాణాలు కోల్పోతే మాత్రం తిరిగి తీసుకురాలేము. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు పక్కన నడుచుకంటూ వెళ్తున్న వారిని కూడా ఢీకొట్టి చంపేసిన ఘటనలు కోకొల్లలు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. 25 మందితో వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో తృటిలో ఓ పెను ప్రమాదం తప్పింది. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జిల్లాలోని రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కంటైనర్ ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది.
అయితే వాటి వెనకే వస్తున్న ఓ ట్రావెల్ బస్సు డ్రైవర్ లారీని తప్పించబోయాడు. ఈ క్రమంలోనే బస్సు ప్రమాదానికి గురయింది. డివైడర్ ను ఢీకొట్టి పక్కకు ఒరిగి పడిపోయింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, క్యాబిన్ లోనే లారీ డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ఘటన గురించి తెలిసి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో గాయాల పాలయిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.