ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు ఓ మహిళా గ్రామ వలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. తస్ పున్నీసా అనే గ్రామ వలంటీర్ తహసీల్దార్ ఆఫీసుపై నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆమెను స్థానికులు బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. బాధితురాలు బి.కొత్తకోట బీసీ కాలనీలో వలంటీర్గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఇళ్ల స్థలాల జాబితాలో అర్హులైన వారికి స్థలాలు ఎందుకు కేటాయించలేదని ఆమె అధికారులను ప్రశ్నించింది. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడం, మరో వైపు లబ్ధిదారులు ప్రశ్నిస్తుండటంతో మనస్తాపానికి గురైన గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు యత్నించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం వాలంటీర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.