పేదింట్లో పుట్టిన ఆ చిన్నారి కష్టపడి చదివి కష్టజీవులైన తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని భావించింది. కష్టపడి చదివి పది, ఇంటర్ మెదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించింది. కానీ ఏమైందో ఏమో కానీ శుక్రవారం విడుదలైన ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో ఆ విద్యార్థి తీవ్ర మనస్థాపానికి గురైంది. తల్లిదండ్రులు ఏం కాదమ్మా.. ఇంతటితో ఏం కాదని నచ్చజెప్పారు. అయినా ఆ రోజు రాత్రి అన్నం తినకుండా అలానే పడుకుంది. ఉదయం తల్లిదండ్రులు లేచి చూసే సరికి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దూశి లక్ష్మణరావు, సరోజిని దంపతుల ఏకైక కుమార్తె అయిన స్వర్ణలత (17) కుమార్తె ఇంటర్లో తక్కువ మార్కులు రావడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న వారికి కంటతడి పెట్టించింది.