విలేకరులు, వారి కృషి సమాజానికి శ్రీరామ రక్ష లాంటిదని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పాత్రికేయులు చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడారు. చిలకలూరిపేటలోని అడ్డరోడ్డు సెంటర్లో ఉన్న తన కార్యాలయంలో నియోజకవర్గంలోని పాత్రికేయులందరికీ గురువారం ఎమ్మెల్యే తన సొంత నిధులతో బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. దాదాపు వంద మంది విలేకరులకు ఒక్కొకరికి ఒక బియ్యం బస్తా, ఆరుకేజీల కూరగాయలు, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ గోధుమపిండి, కేజీ పంచదార, రుచిగోల్డు సనఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ఒకటి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగ రోజున విలేకరులకు వంట సరుకులు అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టే విధుల్లో ఉన్న పాత్రికేయ మిత్రులకు ఈ సమస్య ఎదురుకాకూడదనే ఉద్దేశంతో తాను బియ్యం, నిత్యావసరాలు పంపిణీచేసినట్లు తెలిపారు. ఎవరైనా సరే తప్పులు చేస్తే విలేకరులు నిర్మొహమాటంగా ఎత్తి చూపాలన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు వాటిల్లుతున్నా పాత్రికేయులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తల్హాఖాన్, పార్టీ నాయకులు కె.శ్రీనివాసరావు (గోల్డు), ఆయా వార్డుల నాయకులు పాల్గొన్నారు.