జాతకంలో దోషం ఉండడం వల్లే పెళ్లి కాలేదంటూ ఓ యువతి నమ్మించి మోసం చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆమె నుంచి లక్షలు దోచుకున్నాడు. విజయవాడలో జరిగిన ఈ ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని అయోధ్యనగర్లో నివాసం ఉంటున్న యువతి తండ్రి చనిపోయాడు. తల్లితో కలిసి ఉంటోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నా కలిసి రాలేదు. దీంతో పెద్దలు చెప్పడంతో జాతకంలో ఏమైనా దోషాలున్నాయమోనని ఓ జ్యోతిష్కుడిని కలిసింది.
కృష్ణలంక పాతపోస్టాఫీసు రోడ్డు బియ్యపుకొట్ల బజారులో ఉండే శ్రీశారద సనత్చంద్ర అనే జ్యోతిష్కుడిని కలిసి తన సమస్య తెలిపింది. దీంతో ఆమె జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కుడు పలు దోషాలున్నాయని చెప్పి శాంతిపూజ జరిపించాలన్నాడు. గత సెప్టెంబర్ 23న ఆమె దగ్గర నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. అనంతరం తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్న ఓ అమ్మవారి గుడిలో పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పి మరో రూ.2.82 లక్షలు తీసుకుని ఆమెను అక్కడికి తీసుకువెళ్లాడు. ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయించి పంపేశాడు.
ఆ తర్వాత యువతిని ముగ్గురు ముత్తయిదువులకు దానం చేస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటూ తన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళతోపాటు తన కుటుంబీకులు మరో ఇద్దరికి రూ.70 వేలు ఇప్పించాడు. ఆ తర్వాత మరో పూజ చేయాలని, మరో లక్ష అవుతుందన్నాడు. దీంతో తనవద్ద మరి డబ్బు లేదని చెప్పడంతో ఈ పూజ చేయకుంటే ఇప్పటి వరకు చేసిన పూజ వ్యర్థమవుతుందని చెప్పి అప్పు ఇప్పిస్తానంటూ సిద్ధపడ్డాడు. ఇందుకోసం చెక్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని ఎటువంటి పూజలు చేయంచకుండా ముఖం చాటేశాడు. బాధితురాలు ఫోన్ చేయడంతో ఆమెపట్ల అసభ్యంగా మట్లాడాడు. ఆమెను తిట్టాడు. ఎవరికైనా చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో చివరికి నిజం తెలుసుకున్న యువతి తాను మోసపోయానంటూ పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ దొంగ జ్యోతిష్యుడికి తగిన శిక్ష వేయాలని కోరింది.