ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ అసెంబ్లీలో ఉల్లి లొల్లి..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 02:53 PM

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కూడా వాడీవేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మొదట ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడటం దగ్గర నుంచి మొదలైన ఈ యుద్ధం ఉల్లి అంశంపై చర్చకు వచ్చేసరికి తీవ్రమైంది. ఈ తరుణంలో అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షాలు ఉల్లి ధరల విషయంలో ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..


మంత్రి మోపిదేవి వెంకటరమణ కామెంట్స్…


రాష్ట్రమంతా ఉల్లి కిలో రూ.25లకే అందించామన్న మోపిదేవి.. నవంబర్ 14 నుంచి ఇప్పటివరకు సుమారు 38 వేల క్వింటాళ్ల ఉల్లిని సరఫరా చేశామన్నారు. నవంబర్ నుంచి ఉల్లి ధరలు బాగా పెరిగాయని.. వాటిని ముందే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన అన్నారు.


మరో మంత్రి కురసాల కన్నబాబు ఏమన్నారు…


గుడివాడ రైతు బజారు క్యూలో చనిపోయిన సాంబిరెడ్డి అనే వ్యక్తికి .. ఉల్లిపాయల సమస్యకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దాన్ని పెద్దది చేసి మెడలో ఉల్లిపాయలు వేసుకొచ్చి లొల్లి చేశారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా నిన్న సభను కావాలనే అడ్డుకునేందుకు వారు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. రైతులకు, వినియోగదారులకు నష్టం లేకుండా చూస్తున్నామని.. అంతేకాక కేజికి రూ.100ల సబ్సిడీతో వినియోగదారులకు ఉల్లిని అందిస్తున్నామన్నారు. ఈ విధానాన్ని ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదన్నారు. మరోవైపు ఉల్లి రాష్ట్రం దాటకుండా సరిహద్దుల్లో నిఘా పెంచాలని సీఎం సూచించారన్న ఆయన నిన్న సభలో ప్రతిపక్షం చేసిన నిరసనకు క్షమాపణలు చెప్పాలన్నారు.


ఇక దీనిపై స్పందించిన టీడీపి అధినేత చంద్రబాబు తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ వినియోగదారుల జీవితాలతో ఆడుకుంటోందని.. గుడివాడలో వ్యక్తి ఉల్లి కోసం క్యూలో నిలబడి చనిపోయాడని చంద్రబాబు విమర్శించారు. దీనితో కొడాలి నాని కూడా చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడుతూ.. శవాలతో ఆయన రాజకీయాలు చేస్తున్నారన్నారు. గుడివాడ రైతు బజారులో చనిపోయిన సాంబిరెడ్డి ఉల్లిపాయల కోసం వెళ్లలేదని అతడి కుటుంబమే స్పష్టం చేసిందన్నారు.


ఇక సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉల్లిని అతి తక్కువ ధరకు ఇస్తున్న రాష్ట్రం ఏపీయే అని చెప్పిన ఆయన ఇప్పటివరకు 38,496 క్వింటాళ్ల ఉల్లిని సబ్సిడీ కింద ఇచ్చామని వెల్లడించారు. రూ.25కే ఉల్లిని విక్రయిస్తుండటంతోనే రైతు బజారులో క్యూలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా చంద్రబాబు హెరిటేజ్‌లోనే ఉల్లిని కేజి రూ.200కు అమ్ముతున్నారన్నారు.


ఇక ఈ తరుణంలో చంద్రబాబు జగన్‌కు సవాల్ విసిరారు. తాము హెరిటేజ్‌ను విక్రయించామని, ఆ సంస్థతో తమకు సంబంధం లేదని తేలితే.. ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేస్తారా అని చంద్రబాబు సవాల్ విసిరారు. దీనికి సమాధానంగా కొడాలి నాని చంద్రబాబుకు మరో సవాల్ వేశారు. గుడివాడ రైతు బజారులో చనిపోయిన వ్యక్తి ఉల్లిపాయల కోసం లైన్లో నిలబడి చనిపోలేదని వారి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి చెప్పిస్తే.. మీరు రాజీనామా చేస్తారా అని ఆయన సవాల్ విసిరారు.


మరోవైపు నారా భువనేశ్వరి ఓ ఇంటర్వ్యూలో ఉల్లి ధరపై స్పందించారు. తన జీవితంలో ఉల్లి ధరలు ఇంతలా పెరిగిపోవడం ఎప్పుడూ చూడలేదన్న ఆమె.. త్వరగా ఉల్లి సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలన్నారు. అంతేకాక హెరిటేజ్‌లో రూ.200కు కిలో ఉల్లి అమ్ముతున్నారన్న సీఎం జగన్ మాటలను ఖండిస్తూ.. ఆ సంస్థ తమ నియంత్రణలో లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com