ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలని వైసీపీ నేతలకు పవన్ చురకలు అంటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. తాను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటే వైసీపీ నేతలు తప్పుబట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా అంతా ఆయనను అలాగే పిలుస్తుందనే విషయం వైసీపీ నేతలకు తెలియదా ? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
తాను జగన్ రెడ్డి అంటే పవన్ నాయుడు అంటూ తనకు కులం ఆపాదించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తెలుగు భాషను చంపే ప్రయత్నం చేస్తుంటే... వైసీపీలోని మేధావులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తామంతా ఒకటే అనే భావన తెలంగాణ ప్రజలు, సమాజంలోఉందని... కానీ ఏపీలో మాత్రం ప్రజలు వర్గాలుగా వీడిపోయారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.