సమస్యల సాధనకై ఎంతోమంది ఎన్నో రకాలుగా తమ నిరసనను తెలియజేస్తారు. కొంతమంది రాస్తారోకో చేస్తే.. మరికొందరు రహదారిపై ధర్నాలకు, సంబంధిత కార్యాలయాల వద్ద నిరసనకు దిగుతారు. ఇది ఇలా ఉండగా ఏపీలోని భీమవరంలో ఓ వృద్ధుడు.. సంబంధిత కంపెనీ నిర్లక్ష్యానికి వినూత్న నిరసన తెలిపాడు. అయితే అది కాస్తా అతని ప్రాణం మీదకు రావడంతో.. సంబంధిత ప్రాంతం వద్ద ఆందోళనకర వాతావరణం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే రామరాజు అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో భీమవరంలోని రాజరాజేశ్వరి ఎవెన్యూలో నివాసం ఉంటున్నాడు. ఇక ఆ అపార్ట్మెంట్లో తరచూ లిఫ్ట్ సమస్య వస్తోంది. ఇదివరకు ఇలాగే ఒకసారి లిఫ్ట్ సమస్య వస్తే.. స్థానిక మెకానిక్ను తీసుకొచ్చి లిఫ్ట్ బాగుచేశారు. అయితే సోమవారం మరోసారి లిఫ్ట్ పనిచేయకపోవడం.. అందులో రామరాజు ఉండటంతో.. తన విశ్వరూపాన్ని అపార్ట్ మెంట్ వాసులకు చూపించాడు. స్థానిక మెకానిక్ను పిలవద్దని.. కంపెనీ ప్రతినిధులు వచ్చి.. లిఫ్ట్ ఇబ్బంది పెట్టడానికి గల కారణం చెబితేనే గానీ లిఫ్ట్ నుంచి బయటికి రానని మొండికేసి లిఫ్ట్లోనే కూర్చున్నాడు రామరాజు. దాదాపు 4 గంటల పాటు రామరాజు లిఫ్ట్లో ఉండటంతో స్థానికులందరూ ఆందోళన చెందారు. బయటికి రమ్మని కుటుంబసభ్యులు, స్థానికులు ఎంత బ్రతిమాలినా.. ఫలితం లేకపోయేసరికి.. స్థానిక అధికారులకు, సదరు లిఫ్ట్ కంపెనీకి అపార్ట్మెంట్ వాసులు ఇన్ఫార్మ్ చేశారని విశ్వసనీయ సమాచారం. కాగా లిఫ్ట్ పనిచేయకపోతే.. అందులో ఉండి నిరసన తెలపడం ఏంటని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ కంపెనీ ప్రతినిధులు వచ్చేసరికి ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సమస్యపై నిరసన తెలపడం మంచిదే.. అయితే ఆ నిరసన పనిచేయని లిఫ్ట్ నుంచి కాకుండా.. సదరు కంపెనీ దగ్గరకు వెళ్లి చేస్తే బాగుంటుందని స్థానికుల అభిప్రాయం.