ఆంధ్రప్రదేశ్ డీజీపీగా గౌతమ్ సవాంగ్ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో శనివారం ఆయన కుటుంబ సమేతంగా విచ్చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. నిరంతరం సేవాభావంతో పనిచేస్తామని, మహిళలపై లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కృషి చేస్తామని వెల్లడించారు. సామాన్యులకు పోలీసు శాఖ చేరువలో ఉంటుందని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తాం. పోలీసు శాఖ తమ కోసమే ఉందని ప్రజలు అనుకునేలా చేస్తాం. పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గౌతమ్ సవాంగ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. అదేవిధంగా డీజీపీగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు గౌతమ్సవాంగ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. గతంలో విజయవాడ నగర పోలీసు కమిషనర్గా ఉన్నప్పుడు తరచూ అమ్మవారి ఆలయానికి వచ్చి పూజాదికాల్లో పాల్గొనేవారు. ఈ క్రమంలో గౌతమ్ సవాంగ్ను ఆలయ ఈవో కోటేశ్వరమ్మ సాదరంగా ఆహ్వానించి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.