సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట దక్కింది. ఏభీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) కొట్టివేసింది. ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్ చేయడం చట్ట విరుద్దమంటూ ఏబీ వెంకటేశ్వరరావు.. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ మీద సుధీర్ఘ విచారణ జరిపిన క్యాట్..సస్పెన్షన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సస్పెన్షన్ కాలంలో ఆయనకు రావాల్సిన జీతం, ఇతర భత్యాలను చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
అసలు విషయంలోకి వస్తే.. రక్షణ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఏబీ వెంకటేశ్వరరావు ఆ తర్వాత క్యాట్ను ఆశ్రయించారు. అయితే ఇక్కడ ఏబీకి చుక్కెదురైంది. క్యాట్ సస్పెన్షన్ను సమర్థించింది. అయితే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం.. సస్పెన్షన్ ఎత్తివేసింది. అయితే హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయగా.. సుప్రీంకోర్టు కూడా ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది.
సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్లకంటే ఎక్కువ రోజులు సస్పెన్షన్లో ఉంచకూడదంటూ.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసింది. అలాగే ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు లోబడి.. ఆయనకు పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. రక్షణ పరికరాల కొనుగోళ్లల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మరోసారి అదేకారణంతో సస్పెండ్ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ను ఆశ్రయించగా.. క్యాట్లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది.