వైసిపి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ప్రత్యేక హోదా సాధించేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని చెప్పిన జగన్ ఆర్ధికశాఖ అధికారులతో జరిపిన సమీక్షలలోనూ హోదాపై ప్రత్యేకంగా స్పందించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను కేంద్ర 15వ ఆర్థిక సంఘం కు బలమైన వాదనలు వినిపించేలా సిద్దం కావాలని ఏపి సిఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక స్థితిగతులను, గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను, కేంద్రం సహకారం లేకుంటే ఏర్పడబోయే ఆర్ధిక సమస్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక తయారుచేయాలని సూచించారు. వీటన్నింటికి .. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడమే తక్షణ పరిష్కారంగా 15 ఆర్థిక సంఘానికి నచ్చజెప్పడంతో పాటు. ఏయే పద్దుల కింద రాష్ట్రానికి ఎంతెంత రావాలో స్పష్టంగా అర్ధమయ్యేలా కేంద్రానికి వివరించడం ద్వారా ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు సిఎం.