ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఎన్నికల్లో ఈ జిల్లాలో గెలిచే పార్టీదే అధికారం.. 16 స్థానాల బరిలో ఎవరెవరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 07:49 PM

కృష్ణా జిల్లాకు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలో ఈ జిల్లా కూడా పెద్దది.. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, రాష్ట్ర రాజధాని ప్రాంతంగా గుర్తింపు ఉంద. కృష్ణా జిల్లాకు చెందిన ఎంతోమంది నేతలు ఏపీ రాజకీయాలలో రాణించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఓటర్లు ఏ పార్టీకి అధిక స్థానాలు కట్టబెడితే.. ఆ పార్టీకి అధికారం ఖాయమని చెబుతుంటారు. గత చరిత్రలో కూడా ఇలాగే జరిగింది. కృష్ణా జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి అధికారం చేపట్టబోయే పార్టీలను అంచనా వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో కూడా అదే జరిగింది.. కృష్ణా జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీనే అధికారాన్ని చేపట్టింది.


ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా 10 చోట్ల విజయం సాధించగా.. వైఎస్సార్సీపీ ఐదు సీట్లలో గెలిచింది. బీజేపీ ఒక స్థానంలో గెలుపొందింది. ఇక 2019 ఎన్నికల్లో.. 14 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించగా.. 2 చోట్ల టీడీపీ గెలిచింది.


ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు లోక్ సభ స్థానాలు..


మచిలీపట్నం, విజయవాడ లోక్ సభ స్థానాలు కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా తెలుగు దేశం పార్టీ నుంచి కేశినేని నాని విజయం సాధించారు. ఆయన ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా కేశినేని చిన్ని (శివనాథ్) పోటీ చేస్తున్నారు.. వైఎస్సార్‌సీపీ నుంచి కేశినేని నాని (శ్రీనివాస్) బరిలో ఉన్నారు. కేశినేని చిన్ని, నానిలు అన్నదమ్ములు.. గతంలో ఇద్దరు టీడీపీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వల్లూరు భార్గవ్‌ బరిలో ఉన్నారు.


2019 ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలిచారు. 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి సింహాద్రి చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గొల్లు కృష్ణ‌ బరిలో ఉన్నారు.


కృష్ణా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు..


విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నందిగామ, నూజివీడు, గుడివాడ, పామర్రు, గన్నవరం, మైలవరం, పెనమలూరు, పెడన, జగ్గయ్యపేట, అవనిగడ్డ, కైకలూరు, మచిలీపట్నం.


2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేసే స్థానాల విషయానికి వస్తే.. మొత్తం 14 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తోంది. రెండు నియోజకవర్గాల్లో (కైకలూరు, విజయవాడ పశ్చిమం) బీజేపీ పోటీ చేస్తోంది. జనసేన పార్టీ ఒక నియోజకవర్గం (అవనిగడ్డ)లో బరిలో ఉంది. వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది.


ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేపట్టింది. విజయవాడ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధిని పక్కన పెట్టి.. టీడీపీ నుంచి వచ్చిన నలగట్ల స్వామిదాసును పోటీ చేయిస్తోంది. మైలవరంలో కూడా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ తిరుపతిరావును పోటీ చేయిస్తోంది. మరోవైపు మంత్రి జోగి రమేష్ పెడన నుంచి వెళ్లి పెనమలూరులో పోటీ చేస్తున్నారు. మచిలీపట్నంలో పేర్ని నాని పోటీ నుంచి తప్పుకోగా.. నాని కుమారుడు కిట్టు (కృష్ణమూర్తి) బరిలో నిలిచారు.


టీడీపీ అభ్యర్థుల విషయానికి వస్తే.. తిరువూరులో అనూహ్యంగా అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావును పోటీ చేయిస్తోంది. నూజివీడులో వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీ బరిలోకి దింపింది. గన్నవరంలో కూడా వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తరఫున పోటీలో ఉన్నారు. మిగిలిన స్థానాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లకే అవకాశం ఇచ్చింది టీడీపీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది.. జూన్ 4 ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com