బెంగుళూరు: కర్నాటక జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకు సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు బయటపెట్టారు. లంకేశ్ను హత్య చేసిన ఇద్దరు అనుమానితుల ఊహా చిత్రాలను ఇవాళ విడుదల చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన ఆధారంగా.. ఇద్దరు ఆర్టిస్టులు ఆ చిత్రాలను వేసినట్లు సిట్ పోలీస్ చీఫ్ బీకే సింగ్ తెలిపారు. అయితే ఆ చిత్రాల ఆధారంగా దుండగులు ఏ కులస్థులన్న అంశాన్ని ఇప్పుడే తేల్చలేమని పోలీసులు తెలిపారు. గుర్తు పట్టకుండా ఉండేందుకు దుండగులు చెవిపోగులు, తిలకం పెట్టుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
గౌరీ లంకేశ్ హత్య కేసులో సుమారు 250 మందిని విచారించినట్లు సిట్ పోలీసులు తెలిపారు. లంకేశ్, కాల్బుర్గి హత్యలకు దుండగులు ఒకేరకమైన వెపన్ వాడారన్న విషయాన్ని కూడా ఇప్పుడే దృవీకరించలేమన్నారు. మర్డర్ కోసం రెక్కీ గీసిన దుండగుడి వీడియోను కూడా పోలీసులు తయారు చేశారు. దాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. హిందూ తీవ్రవాదాన్ని విమర్శించే గౌరీలంకేశ్ను సెప్టెంబర్ 5వ తేదీన ఆమె ఇంటి ముందే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మోటర్బైక్పై వచ్చిన దుండగులు సమీపం నుంచి కాల్పులు జరిపి లంకేశ్ను మర్డర్ చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం... జర్నలిస్టు హత్య కోసం దుండగులు 7.65ఎంఎం పిస్తోల్ను వాడినట్లు తెలుస్తున్నది.