ఆచి తూచి మాట్లాడమంటారు పెద్దలు. ప్రస్తుత సమాజంలో ఏది మాట్లాడినా ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాల్సి వస్తోంది. ఇది ముఖ్యంగా సెలబ్రెటీలు, ప్రముఖులకు వర్తిస్తుంది. ఏ మాత్రం నోరు జారినా విమర్శలు, విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కోవడం ఖాయం. ఇదే కోవలో భారత్కు చెందిన ఓ దిగ్గజ క్రికెటర్ అనుకోకుండా చేసిన వ్యాఖ్యలకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిపై వచ్చిన విమర్శల జడివానకు స్పందించి, క్షమాపణలు చెప్పారు. దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఇటీవల అకస్మాత్తుగా మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు, దిగ్గజ క్రికెటర్లు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆరోగ్యంగా ఉండే ఆయన హఠాన్మరణం చెందడం తమను కలిచి వేసిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తున్న తరుణంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సునీల్ గవాస్కర్ బదులిచ్చారు. షేన్ వార్న్ అత్యుత్తమ స్పిన్నర్ కాదని, భారత్లో అతడికి ఏమంత రికార్డులేవీ లేవని చెప్పాడు. అతడి కంటే ముత్తయ్య మురళీధరన్, భారత స్పిన్నర్లే నాణ్యమైన వారని పేర్కొన్నాడు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. షేన్ వార్న్ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు గవాస్కర్ వెల్లడించాడు. వార్న్ చనిపోయిన ఈ సమయంలో తాను అలా మాట్లాడాల్సి ఉండకూడదని అభిప్రాయపడ్డాడు. అయితే యాంకర్ అడిగిన ప్రశ్నకు తాను నిజాయితీగా బదులిచ్చినట్లు పేర్కొన్నాడు. క్రికెట్లో గొప్ప ఆటగాళ్లలో వార్న్ ఒకడని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు.