ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అధికారులు, పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.. ఈ క్రమంలో భారీగా నగదు, బంగారం, వెండి, మద్యం పట్టుబడుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో భారీగా డబ్బులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సోదాలు నిర్వహించగా.. లగేజీ డిక్కీలో రెండు ట్రాలీ బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించాయి.
రెండు బ్యాగుల్లో చెక్ చేయగా.. భారీగా కరెన్సీ కట్టలు ఉన్నాయి. మొత్తం రూ. 2 కోట్ల 40 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. రెండు ట్రాలీ బ్యాగుల్లో 500 రూపాయల నోట్ల కట్టలను పేర్చి.. ఆ బ్యాగులను బస్సు లగేజీ వేసే డిక్కీలో పడేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందనే అలా బస్సులో డిక్కీలో డబ్బుల్ని వేసుంటారని అనుమానిస్తున్నారు. ఆ డబ్బులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.