ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం మేనిఫెస్టో ట్రెండ్ నడుస్తోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి ఇప్పటికే మేనిఫెస్టోలు విడుదల చేశాయి. వైసీపీ నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టో తీసుకురాగా.. టీడీపీ కూటమి ప్రజాగళం మేనిఫెస్టో అంటూ ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. ఇక తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై ఇందులో పార్టీలు హామీలు గుప్పించాయి. అయితే ఈ క్రమంలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా నేను సైతం ఆని ముందుకు వచ్చారు. ఎన్నికలు ఏదైనా తనదైన శైలిలో హంగామా చేసే కేఏ పాల్.. ఈసారి విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రజాశాంతి పార్టీ తరుఫున బరిలోకి దిగుతున్నారు. వైసీపీ, టీడీపీ మేనిఫెస్టోలు విడుదల చేసిన నేపథ్యంలో పాల్ కూడా దశరత్నాలు పేరితో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.
దశరత్నాలు పేరిట రిలీజ్ చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కేఏ పాల్ పది ముఖ్యమైన హామీలు ప్రకటించారు. ప్రజాశాంతి పార్టీకి ఓటేసి గెలిపిస్తే.. ఈ పది గ్యారెంటీలు అమలు చేస్తానంటూ ప్రకటించారు. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం, కేజీ టు పీజీ ఇంగ్లీష్/ తెలుగు మీడియం ఉచిత విద్య, ప్రతి వితంతు మహిళకు నెలకు ఐదువేల రూపాయల పింఛన్, ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు నెలకు ఆరువేల రూపాయల నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఆటో డ్రైవర్లకు లక్ష ఆర్థిక సాయం, మత్స్యకార, రైతులకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని పాల్ హామీ ఇచ్చారు. అలాగే నెలకు 25 వేల జీతం తక్కువ కాకుండా వంద రోజుల్లోనే ఉద్యోగాలు కల్పి్స్తామని ప్రకటించారు.
కే.ఏ. పాల్ విశాఖ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గతంలో మునుగోడు ఉపఎన్నికలు, తెలంగాణ ఎన్నికల సమయంలోనూ పాల్ తన వ్యాఖ్యల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేఏ పాల్.. నిత్యం ఏదో ఒక వ్యాఖ్యలు, చేష్టల ద్వారా మీడియాలో హైలెట్ అవుతూ వస్తున్నారు. గత కొంతకాలంగా విశాఖ వేదికగా రాజకీయాలు మొదలెట్టిన కేఏ పాల్.. అక్కడి నుంచే సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచారు.