ఏపీలోని పొగాకు రైతుల పంట పండింది. ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లో కరవు పరిస్థితులు మనోళ్లకు కలిసొచ్చాయి. బ్రెజిల్, ఇండోనేషియా దేశాల్లో పొగాకు ఉత్పత్తి ఎక్కువ. ఈ దేశాల రైతులు పొగాకును ఎక్కువగా పండిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఆయా దేశాలలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అతి వృష్టి లేదా అనావృష్టి అనేలా అక్కడి పరిస్థితులు తయారయ్యాయి. కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులతో కరవు ఏర్పడగా.. మరికొన్నిచోట్ల అకాల వర్షాలు పొగాకు రైతులను దెబ్బతీశాయి. ఇది భారతీయ రైతులకు ముఖ్యంగా ఏపీ రైతులకు కలిసొచ్చింది.
బ్రెజిల్, ఇండోనేషియా దేశాలలో పొగాకు ఉత్పత్తి తగ్గిపోవటంతో మన దేశ పొగాకుకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పొగాకు రేట్లు పెరుగుతున్నాయి.స్థానికంగా జరుగుతున్న వేలంలో పొగాకు రికార్డు ధర పలుకుతోంది. వచ్చే వారాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కేజీ 280 నుంచి రూ.290 వరకూ పలుకుతోంది. ఇది రూ.300 వరకూ చేరే అవకాశం ఉందని అంచనా. రైతులు ఊహించిన ధర కంటే ఇది దాదాపుగా 300 శాతం ఎక్కువని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
మరోవైపు వేలంలో వ్యాపారుల మధ్య పోటీ కూడా రేట్లు పెరగడానికి కారణంగా అధికారులు చెప్తున్నారు.
ఈ ఏడాది లక్షా 40 వేల టన్నుల పొగాకు ఉత్పత్తి చేయాలని ఇండియన్ టొబాకో బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లక్ష్యానికి మించి లక్షా 60 వేల టన్నుల నుంచి నుంచి లక్షా 70 వేల టన్నుల పొగాకును ఉత్పత్తి అవుతుందని అంచనా. అలాగే బ్రెజిల్, జింబాబ్వేలలో పొగాకు పంట దెబ్బతినడం మనోళ్లకు కలిసివచ్చిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బ్రెజిల్లో 5 లక్షల 50 వేల టన్నుల పొగాకు ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా.. వాతావరణ పరిస్థితుల కారణంగా అది కేవలం 4 లక్షల 40 వేల టన్నులకే పరిమితమైంది. అలాగే జింబాబ్వేలోనూ 3 లక్షల టన్నుల పొగాకు ఉత్పత్తిని అంచనా వేయగా.. అది కేవలం 2 లక్షల 45 టన్నులకే పరిమితమైంది.
ఇక ఇండోనేషియాలోనూ కరవు పరిస్థితులతో పొగాకు ఉత్పత్తి మందగించింది. పొగాకు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న చైనా.. పొగాకు ఎగుమతులపై ఆంక్షలు విధించింది. స్థానిక సిగరెట్ ఇండస్ట్రీ కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో అంతర్జాతీయంగా పొగాకు కొరత ఏర్పడినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిమాణాలతోనే భారత పొగాకుకు డిమాండ్ ఏర్పడిందని చెప్తున్నాయి. ఈ పరిస్థితి మరో ఏడాది పాటు కొనసాగే అవకాశముందని అంచనా. అంతర్జాతీయంగా పొగాకుకు ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు స్థానిక వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వేలంపాటలో పొగాకు రికార్డు ధర పలుకుతోంది. ఈ పరిణామాలన్నీ ఏపీ రైతులకు మేలు కలిగిస్తాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.