అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని... మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రంగాల్లో మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, గౌరవాన్ని కల్పించడానికి... వారి ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు అవకాశాలను కల్పిస్తామని మనం ప్రతిజ్ఞ చేయాలని కోవింద్ సూచించారు. స్త్రీలను గౌరవించడం మన నాగరికతలో ఉందని... అది మహానాయకులు సూచించిన ఆదర్శమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించి... సాధికారత సాధించేలా సంకల్పిద్దామని వెంకయ్య సూచించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత మహిళలు సాధించిన విజయాలను ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వివిధ పథకాల ద్వారా మహిళా సాధికారతపై దృష్టి సారించి.. తమ ప్రభుత్వం గౌరవం, అవకాశాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.
దేశంలో నారీ శక్తిని అగ్రగామిగా ఉంచడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని... భవిష్యత్ లోనూ మరింత శక్తివంతంగా కొనసాగుతాయని ప్రధాని ట్వీట్ చేశారు. మహిళలకు ఉన్న తెలివి, అంకితభావం, బలంతో సమాజాన్ని మార్చగలరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.