ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసుకోండి, ఇబ్బంది పడొద్దు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 07:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం పింఛన్లు పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన పింఛన్లు సచివాలయాల దగ్గర పంపిణీ చేయగా.. మే నెలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. మే 1 నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. దివ్యాంగులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి మాత్రం ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు. అయితే ఈసారి కూడా పింఛన్లు తీసుకునేవారికి మరో తలనొప్పి మొదలైంది. గతంలో సచివాలయాల దగ్గర పడిగాపులు తప్పకపోగా.. ఇప్పుడు బ్యాంకులకు లబ్ధిదారులు క్యూ కట్టారు.


మే 1న బ్యాంకులకు సెలవు కావడంతో.. పింఛన్లు తీసుకోవడానికి ఇవాళ లబ్ధిదారులు బ్యాంకుల దారి పట్టారు. ఉదయం నుంచి బ్యాంకుల దగ్గరకు పింఛన్లు డ్రా చేసేందుకు వెళుతున్నారు. ఒక్కసారిగా లబ్ధిదారులు రావడంతో బ్యాంకుల దగ్గర రద్దీ పెరిగింది. అలాగే కొందరు లబ్ధిదారులు అకౌంట్‌లు సరిగా ఉపయోగించకపోవడంతో.. అకౌంట్లు ఇన్‌ఆపరేట్ మోడ్‌లో ఉన్నాయని బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. బ్యాంక్ అకౌంట్‌ను తిరిగి ఆపరేషన్ మోడ్‌లోకి తీసుకొస్తేనే పింఛన్ డబ్బులు డ్రా చేసుకోవచ్చని బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువమందికి ఇదే సమస్య ఎదురవుతోంది.


అకౌంట్ తిరిగి రన్నింగ్‌లోకి రావాలంటే కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఆధార్, పాన్ జిరాక్స్‌తో పాటుగా బ్యాంకు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ పూర్తి చేసి ఇవ్వాలి. ఈ అకౌంట్లు తిరిగి ఆపరేషన్ మోడ్‌లోకి తీసుకురావాలంటే కొంత నగదు డిపాజిట్ కింద ఉంచాలని బ్యాంక్ సిబ్బంది అంటున్నారు. ఈ పని పూర్తి చేసిన మరుసటి రోజు అకౌంట్ నుంచి పింఛన్ డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే పింఛన్లు తీసుకునేవారిలో చాలామందికి పాన్ కార్డు లేని పరిస్థితి. తమకు చదువు రాదని.. పింఛన్ డబ్బుల కోసం ఇలా ఇబ్బంది పెడుతున్నారని పలువురు పింఛన్ తీసుకునే లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో చాలా దూరం నుంచి వచ్చామని.. తమ పరిస్థితి అర్థం చేసుకోవాలంటున్నారు.


పింఛన్లు తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందంటున్నారు లబ్ధిదారులు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వేడి గాలుల దెబ్బకు బయటకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయని.. బ్యాంకులు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని గుర్తు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత ఉంటుందోని.. పోనీ త్వరగా వెళ్లినా తిరిగి వచ్చే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి దగ్గరకే పింఛన్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసుంటే తమకు ఇబ్బందులు లేకుండా పోయేదంటున్నారు. అంతేకాదు పింఛన్ లబ్ధిదారులు బ్యాంకు అకౌంట్‌లు రన్నింగ్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని.. ముందుగానే బ్యాంకులో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు తీసుకెళితే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com